ముగించు

‘స్పందన’ పోర్టల్ ద్వారా అర్జీ పెట్టుకొనుట ఎలా?

ప్రజలు మారు మూల గ్రామాల నుండి వచ్చి అధికారులకు తమ సమస్యలపై అర్జీలను ఇచ్చేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. అర్జీ దారుడు ఇచ్చిన అర్జీని పరిష్కరించ వలసిన అధికారికి పంపుటకు ప్రస్తుతం 7 రోజుల నుండి 10 రోజుల వరకు సమయం వృధా అవుతున్నది. ఆయా అర్జీ లని వారు పరిష్కరించుటకు 3 నెలలు నుండి 6 నెలల సమయం పడుతున్నది. అర్జీదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరుగుతున్నారు.

ప్రజా సమస్యలను అధికారులు తెలుసుకొనుట మరియు పరిష్కరించుటలో సమస్యగా ఉన్న ఈ పద్దతిని మార్చుటకు గౌ. ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఈ సాఫ్ట్ వేర్ ని రూపొందించుటకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కరించబడతాయి మరియు ప్రజా సమస్యల పై ప్రభుత్వ అధికారులకు బాధ్యత పెరుగుతుంది.

రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి అధికారుల వరకు అనుసంధానం చేస్తూ ప్రజల నుండి స్వీకరించే అర్జీలను ఆన్ లైనులో కంప్యూటరీకరించే కార్యక్రమమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ ఏర్పాటు చేయబడినది. ప్రజల నుండి వచ్చే అర్జీ వివరములు, వాటి స్థితి మరియు పరిష్కార వివరములు సంక్షిప్త సందేశాలు మరియు ఆన్ లైన్ ద్వారా తెలుసుకొనడం ఇందులోని ప్రత్యేకత. కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పరిష్కరించబడిన ఆర్జీల గురించి ఆడిట్ చేయటం మరింత ప్రత్యేకతను సంతరించుకొన్నది. ఈ వెబ్ సైట్ తెలుగు లోనే అభివృద్ధి చేయడం మరో ప్రత్యేకత.

  • ఏ రోజైనా అర్జీదారునియొక్క అర్జీని రాష్ట్ర /జిల్లా/మండల స్థాయిలో అధికారులు స్వీకరించి పరిష్కరించు అధికారికి పంపుచూ వివరాలతో అర్జిదారునికి అధికారిక రశీదు పత్రము ఇస్తారు.
  • అర్జీదారుడు అర్జీ ఇచ్చిన తరువాత అర్జీని యధాతధంగా స్కాన్ చేసి ఆన్ లైన్ ద్వారా పరిష్కారించవలసిన అధికారికి పంపుతారు.
  • ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితి తో గడువు నిర్దేశించబడినది.
  • సిటిజన్ ఆన్ లైన్ లో మీకోసం పోర్టల్ ద్వారా లాగిన్ చేసుకొని తనే స్వయంగా తమ సమస్యను అధికారికి పంపవచ్చును. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మొట్ట మొదటి సారిగా ఈ విదానాన్ని అమలు చేయటం జరిగింది.
  • నిర్దిష్ట కాలపరిమితి లో నిర్దేశించిన అధికారి ద్వారా సమస్య పరిష్కారం కానిచో నిర్ణయించిన గడువు దాటిన వెంటనే పై స్థాయి అధికారికి పరిష్కారం కొరకు పంపబడుతుంది.
  • రశీదు పత్రము లోని అర్జీ నెంబరు ద్వారా అర్జీదారుడు తన అర్జీ యొక్క పరిస్థితిని అనగా అధికారులు తన అర్జీ పై తీసుకున్న చర్యలు గురించి కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబరు 1100 / 1800-425-4440 కు ఫోన్ చేసి వివరములు తెలుసుకొనవచ్చును.

పర్యటన: http://spandana.ap.gov.in/

మరిన్ని వివరాలకు సంప్రదించండి:

ప్రాంతము : ఫిర్యాదుల విభాగం, కల్లెక్టరేట్ కాంప్లెక్స్ (లేదా) సంబంధిత గవర్నమెంటు ఆఫీసు | నగరం : శ్రీకాకుళం | పిన్ కోడ్ : 532001